- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
సంగారెడ్డి, వెలుగు : ప్రజలకు మరింత సమర్థవంతంగా వైద్యసేవలు అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ కార్యక్రమం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద సంగారెడ్డి జిల్లాను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన, అమలుపై రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సంగారెడ్డి జిల్లాలోని మొత్తం జీజీహెచ్-, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ, అర్బన్ ప్రైమరీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లు-, బస్తీ దవాఖానాలకు వచ్చే ప్రతి రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, డిజిటల్ కార్డు జారీకి కసరత్తును ప్రారంభించాలని సూచించారు.
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్కు అవసరమైన ఐటీ సదుపాయాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోగి హాస్పిటల్కు వచ్చిన మొదటి దశ నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ఓపీ, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్, ఫార్మసీ వంటి అన్ని విభాగాల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ప్రావీణ్యకు సూచించారు. డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా రోగి పూర్తి వైద్య చరిత్ర అందుబాటులో ఉండడంతో తక్షణ చికిత్స ఈజీ అవుతున్నారు. ఎన్సీడీ, కమ్యూనల్ డిసీజెస్, ఎంసీహెచ్, చైల్డ్ హెల్త్ సేవలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, రిఫరల్ సిస్టమ్ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందేందుకు ఉపయోగపడుతుందన్నారు.
సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్న పైలట్ ప్రాజెక్ట్ను ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు సంబంధించిన అంశాలను ఆఫీసర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికతి వివరించారు. రివ్యూలో ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్. చొంగ్తు, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో ఉదయ్కుమార్ పాల్గొన్నారు.
